Migrants: సిమెంట్ మిక్సర్ లో 18 మంది వలస కార్మికులు... దిగ్భ్రాంతికి గురైన పోలీసులు

  • లాక్ డౌన్ తో దిక్కుతోచని స్థితిలో వలస కార్మికులు
  • స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు
  • మిక్సర్ వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించి దొరికిపోయిన వైనం
Police identified migrants in a cement mixer vehicle

కరోనా నివారణ కోసం కేంద్రం విధించిన లాక్ డౌన్ తో వలస కార్మికులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఓ హైవేపై సిమెంట్ మిక్సర్ వాహనాన్ని ఆపిన పోలీసులు ఆ మిక్సర్ ట్యాంకులో చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సిమెంటు, కంకర, ఇసుక, నీళ్లు కలిపి కాంక్రీట్ మిశ్రమాన్ని తయారుచేసే ఆ మిక్సర్ ట్యాంకులో 18 మంది వలస కార్మికులు దర్శనమిచ్చారు. స్థలం సరిపోకపోవడంతో వారిని కుక్కినట్టు పోలీసులు గుర్తించారు.

ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళుతుండగా ఇండోర్, ఉజ్జయిన్ జిల్లాల మధ్య వారిని అడ్డుకున్నారు. వాహనం ఎక్కడికి వెళుతోందని పోలీసులు ప్రశ్నించగా, డ్రైవర్ నీళ్లు నమిలాడు. దాంతో అనుమానం వచ్చి సోదా చేయగా, మిక్సర్ ట్యాంకులో వలస కార్మికులు కనిపించారు. ట్రక్ డ్రైవర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, కార్మికులను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వస్థలం వెళ్లేందుకు బస్సు ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News