Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. సోదరుడిని బావిలోకి తోసి యువతిపై ఏడుగురి అత్యాచారం

  • బైక్‌పై వస్తున్న వారిపై దాడి
  • ఏడుగురు నిందితుల్లో ముగ్గురు బాలలు
  • పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
Gang Rape in Madhya Pradesh

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నేరాల రేటు బాగా తగ్గిందని భావిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. బైక్‌పై వస్తున్న అన్నాచెల్లెళ్ళపై దాడిచేసిన నిందితులు యువతి సోదరుడిని బావిలోకి తోసేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉండడం గమనార్హం.

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని పాధార్ సమీప గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, తన సోదరుడితో కలిసి బైక్‌పై పెట్రోలు బంకుకు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ హెడ్‌లైట్ పాడైంది. దీంతో మార్గమధ్యంలో యువకుడు బండి ఆపి దానిని సరిచేయడం ప్రారంభించాడు.

అదే సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు యువతి సోదరుడిపై దాడిచేసి పక్కనే ఉన్న బావిలోకి తోసేశారు. అనంతరం యువతిని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే ఉన్న మరో నలుగురితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బావిలోంచి ఎలాగోలా బయటపడిన బాధిత యువతి సోదరుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు గాలింపు చేపట్టారు. అక్కడికి సమీపంలోనే అపస్మారక స్థితిలో ఉన్న యువతి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు బాలలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులను బాధితురాలు గుర్తించిందని, త్వరలోనే పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News