Nirav Modi: నీరవ్ మోదీకి కలిసొచ్చిన కరోనా లాక్ డౌన్!

  • లండన్ లోని వాండ్స్ వర్త్ జైల్లో ఉన్న నీరవ్ మోదీ
  • భారత్ కు అప్పగించడంపై  మే 11న విచారణ
  • లండన్ లో లాక్ డౌన్ ఉండటంతో ప్రక్రియకు అంతరాయం
London lockdown helping Nirav Modi

రూ. 13 వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి లండన్ కు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కరోనా రూపంలో కాలం కలిసొచ్చింది. లాక్ డౌన్ వల్ల నీరవ్ ను భారత్ కు తీసుకొచ్చే ప్రక్రియకు అంతరాయం కలుగుతోంది. లండన్ లో కూడా లాక్ డౌన్ ఉండటంతో... భారత బృందాలు అక్కడకు వెళ్లడం కష్టమవుతోంది. దీంతో, అక్కడి కోర్టు నీరవ్ ను భారత్ కు అప్పగించే ప్రక్రియలో జాప్యం కలుగుతోందని అధికారులు తెలిపారు.

నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే విషయంపై మే 11న లండన్ కోర్టులో విచారణ జరగనుంది. అయితే లాక్ డౌన్ వల్ల నీరవ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశాన్ని కూడా కోర్టు పరిశీలిస్తోంది. లండన్ వెళ్లడం కష్టమైతే తాము కూడా క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయం చేసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఏం చేస్తుందో వేచి చూస్తామని చెప్పారు. మరోవైపు, లండన్ లోని వాండ్స్ వర్త్ జైల్లో ప్రస్తుతం నీరవ్ మోదీ ఉంటున్నారు.

More Telugu News