London: లండన్‌లో గుండెపోటుతో మృతి చెందిన వరంగల్ జిల్లా విద్యార్థి

  • ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన కాయిత సతీశ్ 
  • ఉన్నత చదువుల కోసం గతేడాది లండన్‌కు
  • నిద్రలోనే గుండెపోటు
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
Telangana Student dead in London with heart attack

పై చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందాడు. జిల్లాలోని ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన కాయిత సతీశ్ (26) గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. భారత కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురయ్యాడు. నిద్రిస్తున్న మంచంపై నుంచి కిందపడిపోవడంతో గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సతీశ్‌ను రాయల్ ప్రిస్టిన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

సతీశ్ మృతి విషయాన్ని అతడి స్నేహితులు రాంనగర్‌లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కుమారస్వామి, శారదకు వీడియో కాల్ ద్వారా తెలిపారు. విషయం విన్న వారు గుండె పగిలేలా రోదించారు. ఇటీవలే కుమారుడితో మాట్లాడామని, కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించామని, అంతలోనే ఇలా జరిగిందని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు.

కాగా, సతీశ్ అన్న రంజిత్ అమెరికాలో ఉండగా, తమ్ముడు దేవేందర్ లండన్‌లోనే మరో ప్రాంతంలో ఎంఎస్ చదువుతున్నాడు. సతీశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాల్సిందిగా బాధిత తల్లిదండ్రులు తెలంగాణ  ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

More Telugu News