Srikakulam District: బైక్ ఆపిన కానిస్టేబుల్‌ను చితక్కొట్టిన తండ్రీకొడుకులు!

  • శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఘటన
  • ఎందుకు ఆపావంటూ కానిస్టేబుల్ చేతిలోని లాఠీ లాక్కుని దాడి
  • కొడుకుని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు
Father and son attacked constable in Srikakulam dist

లాక్‌డౌన్ నేపథ్యంలో బైక్‌పై రోడ్డుమీదికొచ్చిన తండ్రీ కొడుకులను ఆపిన కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. తమను ఆపిన కానిస్టేబుల్‌ను వారిద్దరూ కలిసి చితకబాదారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. టెక్కలి మండలంలోని పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులైన వాకాడ శ్రీనివాసరావు, వినీత్‌లు బైక్‌పై వస్తుండగా, కోటబొమ్మాళి రైతు బజార్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భైరి జీవరత్నం వీరిని ఆపాడు. దీంతో తమను ఎందుకు ఆపావంటూ కానిస్టేబుల్‌తో తండ్రీకొడుకులు గొడవకు దిగారు.

ఈ క్రమంలో గొడవ మరింత పెద్దదైంది. ఆగ్రహం పట్టలేని శ్రీనివాసరావు, వినీత్‌లు కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీ లాక్కుని అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వినీత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News