Chiranjeevi: 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన కొత్త చిత్రం టైటిల్ చెప్పేసిన చిరంజీవి

  • బ్రహ్మాజీ తనయుడు నటించిన చిత్రం ఓ పిట్టకథ
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు ఉత్తేజభరిత ప్రసంగం
  • కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం చేస్తున్నానని వెల్లడి
Chiranjeevi reveals his new movie title

మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే, షూటింగ్ ఉండి కూడా ఆయన నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు నటించిన 'ఓ పిట్టకథ' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. ఈ సందర్భంగా యువ నటీనటులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చిత్రసీమలో ఎలా ఎదగాలో వివరించారు. ఇండస్ట్రీ నుంచి ఏమి పొందారో దాన్ని తిరిగి ఇవ్వాలని తెలిపారు. క్రమశిక్షణతో మెలగడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదగవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా తన కొత్తసినిమా టైటిల్ ను ఊహించని విధంగా  బయటకుచెప్పేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నానని చెప్పారు. దాంతో ఆడిటోరియంలో ఒక్కసారిగా కేకలు మిన్నంటాయి. వేదికపై ఉన్నవాళ్లు కూడా హర్షాతిరేకాలు చేస్తుండడంతో చిరు ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. దర్శకుడు కొరటాల శివ టైటిల్ అనౌన్స్ చేసేందుకు పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని ఉంటాడని, ఇప్పుడు తానిలా టైటిల్ చెప్పేస్తే పాపం కొరటాల శివ ఏమనుకుంటాడో ఏమో అని చిరు విచారం వ్యక్తం చేశారు. "సారీ శివా" అంటూ చిరంజీవి సభాముఖంగా క్షమాపణలు తెలిపారు.

More Telugu News