Gold: షాకిస్తున్న బంగారం ధర.. రూ. 50 వేలు దాటుతుందని అంచనా!

  • పరుగులు పెడుతున్న బంగారం ధర
  • అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక మందగమనం ఉద్రిక్తతలే కారణం
  • ఈక్విటీల నుంచి పసిడివైపు చూస్తున్న మదుపర్లు
Gold rates going to raise

గత కొన్ని రోజులుగా ఊహంచని స్థాయిలో పెరుగుతూ పోతున్న బంగారం ధర రూ.50 వేలు దాటే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 మదుపరుల్లో గుబులు రేపుతోంది. దీంతో ఇతర వాటితో పోలిస్తే బంగారంపై పెట్టుబడులు పెట్టడం మేలని భావిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి.

మరోవైపు, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ఊపందుకోవడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా రెండు రోజుల క్రితం 42 వేల మార్క్ దాటిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.43 వేల వద్ద కొనసాగుతోంది. అయితే, ఇది ఇక్కడితో ఆగిపోదని, రూ.50 వేలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కోవిడ్-19 కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయం వంటివి బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని కమోడిటీ విశ్లేషకులు చెబుతున్నారు. లోహాలపై పెట్టుబడులే సేఫ్ అని భావిస్తున్న మదుపర్లు ఈక్విటీలోని తమ పెట్టుబడులను అటువైపు మళ్లిస్తున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే మరో ఒకటి రెండేళ్లలో ఔన్సు బంగారం ధర 2 వేల డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని సిటీ గ్రూప్ అంచనా వేసింది. అదే జరిగితే బంగారం ధర రూ.50 వేలు దాటేస్తుందని అంటున్నారు. అయితే, చైనా, భారతదేశాలు మందగమనంలో కొనసాగితే మాత్రం బంగారానికి అంత డిమాండ్ ఉండకపోవచ్చని అంటున్నారు.

More Telugu News