Madhya Pradesh: పొరపాటున ఆవుదూడను చంపినందుకు.. సొంత బిడ్డనే పెళ్లి చేసుకొమ్మన్నారు: మధ్యప్రదేశ్ లో పంచాయతీ తీర్పు

  • అలాగైతేనే పరిహారం అవుతుందని ఊరి పెద్దల పట్టు
  • ఓ వ్యక్తి బైక్ పై వెళ్తూ ఢీకొట్టడంతో ఆవు దూడ మృతి
  • ఆ వ్యక్తికి సొంత బిడ్డతోనే పెళ్లికి ఏర్పాటు
  • రక్షించిన చైల్డ్ లైన్, పోలీసు అధికారులు
man asked to marry minor daughter to atone for killing a calf

ఓ ఆవు దూడను బైక్ తో ఢీకొట్టి, అది చనిపోవడానికి కారణమైన వ్యక్తి.. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలని పంచాయతీ పెద్దలు ఆదేశించారు. అలాగైతేనే పాపానికి పరిహారం అవుతుందంటూ పట్టుపట్టారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. మధ్యప్రదేశ్ లోని విదిశ జిల్లా పతారియాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు, అధికారులు వెళ్లి ఆ అమ్మాయిని కాపాడారు. ఆమె వయసు కేవలం 14 ఏళ్లేనని గుర్తించారు.

బైక్ పై వెళ్తూ..
పతారియాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి ఊరిలో తన బైక్ పై వెళ్తుండగా ఆవు దూడ అడ్డం వచ్చింది. అతను బైక్ ను కంట్రోల్ చేయలేక దానిని ఢీకొట్టడంతో చనిపోయింది. ఇది మహా పాపమని, పరిహారం చేసుకోవాలని ఊరి పెద్దలు పంచాయతీ పెట్టారు. ఆ వ్యక్తి యూపీ వెళ్లి గంగా నదిలో స్నానం చేసి వచ్చాడు. ఊరి వాళ్లందరికీ భోజనం పెట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఊరి పెద్దలు వినిపించుకోలేదు. పాప పరిహారం కావాలంటే తన సొంత బిడ్డను పెళ్లి చేసుకోవాలని ఆదేశించారు. వారి ఒత్తిడి మేరకు సదరు వ్యక్తి దానికి అంగీకరించక తప్పలేదు. పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు.

పోలీసులు వచ్చినా వెనక్కి తగ్గలేదు
ఈ విషయంపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు, చైల్డ్ లైన్ అధికారులు పతారియా గ్రామానికి వచ్చారు. అలా పెళ్లి చేయడం సరికాదని, అంతేకాకుండా మైనర్ బాలికకు పెళ్లి చేయడం నేరమని చెప్పారు. అయినా ఆ వ్యక్తి, ఊరి వాళ్లు వినలేదు. ఆ అమ్మాయి మేజర్ అని, ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతోందని వాదించారు. పెళ్లి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆ అమ్మాయి ఆధార్ కార్డు తెప్పించి చూసి, ఆమె వయసు 14 ఏళ్లేనని గుర్తించారు. పెళ్లి చేయవద్దని ఊరివాళ్లను, ఆమె తల్లిదండ్రులను గట్టిగా హెచ్చరించారు.

కన్యాదానంతో పాపం పోతుందట! 

మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి మూఢ నమ్మకాలు ఎక్కువని పతారియా పోలీస్ స్టేషన్ సీఐ చెప్పారు. ఆవు దూడను చంపితే పరిహారం చేసుకోవాల్సిందేనని నమ్ముతారని.. గంగా నదిలో మునిగిరావడం, ఊరి వాళ్లందరికీ విందు ఇవ్వడం ద్వారా పరిహారం జరుగుతుందని అంటుంటారని తెలిపారు. కొన్నిచోట్ల ఆవును గానీ, దూడను గానీ చంపితే.. కన్యాదానం చేస్తేనే ఆ పాపం పోతుందని నమ్ముతారన్నారు. అందుకే సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాల్సిందిగా తీర్పులు ఇస్తారని చెప్పారు. ఆ బిడ్డ చిన్న పాప అయినా కూడా ఈ ఆచారాన్ని అమలు చేస్తారని.. దీనిని మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

More Telugu News