beggar: విజయవాడలో సాయిబాబా గుడికి 8 లక్షలు విరాళమిచ్చిన బిచ్చగాడు!

  • చాలా కాలం రిక్షా తొక్కిన యాదిరెడ్డి
  • మోకాలు నొప్పి కారణంగా భిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి
  • గుడికి డబ్బులిచ్చిన కొద్దీ తనకు ఇంకా వస్తున్నాయని వెల్లడి

అతని పేరు యాదిరెడ్డి. విజయవాడలో ఆలయాల ముందు కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నాడు. అలా విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. నిజానికి అతను ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు. మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు.

వచ్చినవన్నీ గుడి కోసమే..

మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పాడు. కాలం గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం దెబ్బతింటోందని, తనకు వచ్చిన డబ్బంతా గుడికే ఇచ్చేస్తున్నానని తెలిపాడు. తాను గుడికి డబ్బులివ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తుల్లో తనకు గుర్తింపు వచ్చిందని.. తనకు వచ్చే డబ్బులు మరింతగా పెరిగాయని యాదిరెడ్డి వెల్లడించాడు. ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని చెప్పాడు. తన జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానన్నాడు.

11 ఏళ్ల వయసులో వచ్చి..

యాదిరెడ్డి స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చింతాబాయి గ్రామం. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో 11 ఏళ్ల వయసులో విజయవాడకు వచ్చాడు. మొదట్లో రిక్షా తొక్కి బతికినా.. ఆరోగ్యం సహకరించక భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు యాదిరెడ్డి వయసు 73 సంవత్సరాలు. సాయిబాబా గుడిలో నిత్యాన్నదాన పథకానికి ఏటా విరాళాలు ఇస్తూ ఉంటాడు.

More Telugu News