Mamata Banerjee: 2021లో బీజేపీని ఓడించి, అంత్యక్రియలు నిర్వహిస్తాం: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

  • 2018 నుంచి బీజేపీ రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతోంది
  • డబ్బు బీజేపీని కాపాడదు
  • రానున్న యుద్ధానికి మహిళలు శంఖారావాన్ని పూరిస్తారు
Bengal CM Mamatha benerjee says We will defeat BJP and  conduct its funerals

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. విభజన, ద్వేష పూరితమైన రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు. ఇది సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పని ఆమె పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన మంచి పనులే మళ్లీ ఆప్ పార్టీని గెలిపించాయని ప్రశంసించారు.

2021లో పశ్చిమ బెంగాల్లో జరిగే ఫలితాల్లో బీజేపీ ఇదే తీరున ఓటమి పాలవుతుందని మమత జోస్యం చెప్పారు. త్వరలోనే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుందన్నారు. తమ రాష్ట్రంలో జరిగే ఎన్నికలతో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ఆ పార్టీ శవపేటికపై దించే చివరి మేకు తమదేనంటూ.. బీజేపీ అంత్యక్రియలను తామే నిర్వహిస్తామన్నారు.

 2018 నుంచి పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఉనికిని కోల్పోయిందని పేర్కొన్నారు. డబ్బు బీజేపీని రక్షించదంటూ, రానున్న ఎన్నికల యుద్ధానికి మహిళలు శంఖం పూరించి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ వెదజల్లే డబ్బుకు మహిళలు పూరించే శంఖారావాలే బలమైన ఆయుధాలవుతాయని మమత అభివర్ణించారు.  

More Telugu News