Mumbai: రైల్వే స్టేషన్ ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిపై యువకుడి పిచ్చివేషాలు!

  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాయ్‌జుర్
  • బతుకుదెరువు కోసం ముంబై వచ్చి పాడుపనులు
  • మఫ్టీలో వెళ్లి పట్టుకున్న పోలీసులు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాయ్‌జుర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం ముంబై వచ్చాడు. కానీ అది మానేసి మాతుంగా రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మాటువేసేవాడు. ఒంటరిగా వచ్చే యువతులను లక్ష్యంగా చేసుకునేవాడు. వారు కనిపించగానే వెనకనుంచి వెళ్లి గట్టిగా పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారు ప్రతిఘటిస్తే పరారయ్యేవాడు. గత కొన్ని నెలలుగా ఇదే పని. అతడి బారినుంచి తప్పించుకున్న మహిళలు బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లిపోయేవారు తప్పితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో అతడి ఆగడాలు కొనసాగాయి.

గత నెల 25న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు.. బ్రిడ్జిపై ఓ యువతిని వేధిస్తున్న రాయ్‌జుర్ కనిపించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు పాత ఫుటేజీలను కూడా గమనించగా అతడి లీలలు బయటపడ్డాయి. అతడు తరచూ ఇదే పనిచేస్తున్నట్టు గుర్తించారు. తాజాగా, మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అతడి వేధింపులు ఎదుర్కొన్నవారు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఒకవేళ ఎవరూ రాకపోతే న్యాయపరంగా ఉన్న ఇతర అవకాశాలను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు.

More Telugu News