Chandrababu: జాతీయ మీడియాకు కులం లేదు... వాళ్లు రాసేవాటిపై ఏం చెబుతారు?: చంద్రబాబు

  • ఇక్కడి మీడియా విమర్శిస్తే 'కులం' అంటగడుతున్నారు
  • రాష్ట్ర పరిణామాలపై జాతీయ మీడియా ఎడిటోరియల్స్ కూడా రాస్తోంది  
  • 'ది ప్రింట్' పత్రిక జగన్ ని తుగ్లక్ అందన్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడి మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా రాస్తే ఎల్లో జర్నలిజం అంటూ కులముద్ర వేస్తున్నారని ఆరోపించారు. కానీ జాతీయ మీడియా సైతం ఏపీ సర్కారుపై విమర్శనాత్మకంగా స్పందిస్తోందని, దీనికి ఏమని బదులిస్తారని ప్రశ్నించారు.

"ఇక్కడి మీడియా ఏదైనా రాస్తే ఎల్లో జర్నలిజం అంటారు, కులం అంటడగతారు. కానీ జాతీయ మీడియా కూడా ఇక్కడి పరిణామాలపై రాస్తోంది. పైగా ఎడిటోరియల్స్ లో కూడా రాస్తున్నారు. జాతీయస్థాయిలో తీవ్ర పరిణామాలు జరిగితేనే ఎడిటోరియల్స్ లో రాస్తారు. ప్రభుత్వాలను ప్రశ్నించే స్వేచ్ఛ మీడియాకు ఉంది.

ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు మానుకోవాలని 'టెలిగ్రాఫ్' పత్రికలో పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు వెనక్కి వెళ్లడం రాష్ట్రానికి మంచిది కాదని, మూడు రాజధానుల నిర్ణయం సరికాదని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో స్పష్టంగా పేర్కొన్నారు. జగన్ సర్కారు అమరావతి నిర్మాణాలు నిలిపివేయకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని 'ఎకనామిక్ టైమ్స్' సూచించింది. అంతేకాదు, ఆంధ్రా సీఎం... అమరావతిని చంపొద్దు. రాజకీయ కక్షసాధింపు కోసం రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయవద్దు అంటూ హితవు పలికింది.

జగన్ చపలచిత్త స్వభావంతో రాజధానికి గండికొడుతున్నారు అంటూ మరో మీడియా సంస్థ పేర్కొంది. లక్షలాది కోట్ల పెట్టుబడులతో సాగుతున్న విద్యుత్ ప్రాజెక్టులు, అమరావతి ప్రాజెక్టులు రద్దుచేయడం, పోలవరం రీటెండరింగ్ కు వెళ్లడం ఏపీలోనే కాదు, మొత్తం దేశంలోనే పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందని అమెరికాకు చెందిన 'బ్లూంబెర్గ్' మీడియా సంస్థ రాసింది. మూడు రాజధానుల అమలు అంత తేలిక కాదని 'ది హిందూ' రాసింది. రైతుల మనోభావాలు పట్టించుకోవాలని తెలిపింది. 'ది ప్రింట్' పత్రికలో ఏకంగా తుగ్లక్ అంటూ సీఎం జగన్ గురించి రాశారు" అంటూ వివరించారు.

More Telugu News