Tamilnadu: ప్రియురాలిని తీసుకెళ్లి స్నేహితులతో అత్యాచారం చేయించబోయిన ప్రియుడు... చితగ్గొట్టిన ప్రజలు!

  • ప్రియుడిని నమ్మి అడవిలోకి వెళ్లిన యువతి
  • స్నేహితులను పిలిపించి అత్యాచారయత్నం
  • స్నేహితులు పారిపోగా, ప్రియుడిని కట్టేసి కొట్టిన ప్రజలు

ప్రేమించిన వాడే కదా అని నమ్మి వెళితే, నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి, స్నేహితులను పిలిపించి, వారితో అత్యాచారం చేయించబోయిన ఓ యువకుడిని స్థానిక ప్రజలు పట్టుకుని చావగొట్టిన ఘటన తమిళనాడులోని అమిర్ధి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళితే, రాణిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (19) వేలూరులోని కాలేజీలో చదువుతుండగా, అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి (19) పరిచయం అయ్యాడు. వారి స్నేహం ప్రేమగా మారగా, ఆమెను తీసుకుని వేలూరు సమీపంలోని అమిర్థి పార్కుకు తీసుకెళ్లిన యువకుడు, అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవుల్లోకి తీసుకెళ్లాడు.

ఆపై తన ముగ్గురు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. అక్కడ యువతిని అత్యాచారయత్నం చేసేందుకు నలుగురూ ప్రయత్నించగా, ఆమె కేకలు పెడుతూ పరిగెట్టింది. అక్కడికి సమీపంలోనే కట్టెలు కొడుతున్న ఓ వృద్ధుడికి ఆమె కేకలు వినిపించగా, వెళ్లాడు. చిరిగిపోయిన దుస్తులతో వున్న ఆమె వృద్ధుడిని సాయం కోరింది.

దీంతో అతను కేకలువేయగా, చుట్టుపక్కల కట్టెలు కొడుతున్న వారంతా చేరారు. వీరిని చూసిన ముగ్గురు స్నేహితులూ పరారుకాగా, ప్రియుడు దొరికిపోయాడు. అతనికి దేహశుద్ధి చేసి, చెట్టుకు కట్టేసి, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. పోలీసులకు చెబితే, పరువు పోతుందని వారు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం విచారణ ప్రారంభించారు.

More Telugu News