Poonam Kaur: నిర్భయ దోషుల వరుస పిటిషన్లపై పూనమ్ కౌర్ ఆగ్రహం

  • క్షమాభిక్ష కోరుతున్న దోషులు
  • మృగాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారా అంటూ పూనమ్ ఆగ్రహం
  • మానవ హక్కుల సంఘాల పేరుతో దందా జరుగుతోందని ఆరోపణ

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖాయమైన దగ్గర్నుంచి తీవ్రస్థాయిలో క్షమాభిక్ష పిటిషన్ లు దాఖలవుతుండడం పట్ల సినీ నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మానవ హక్కుల సంఘాల కార్యకర్తల పేరుతో దోషులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేపనిగా క్షమాభిక్ష పిటిషన్ లు దాఖలు చేసీ చేసీ అలసిపోయారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఓ అమ్మాయిపై అత్యాచారం జరిగితే  మానవ హక్కుల సంఘాల పేరుతో ఇలాంటి వ్యవహారాలు ఎలా నిర్వహిస్తున్నారో అర్థం కావడంలేదని, ఆ కిరాతకులను కాపాడాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చిందని వ్యాఖ్యానించారు.

నిర్భయ తల్లి ఆశా గారిని ఇదే ప్రశ్న అడిగితే, ఈ విషయంలో ఏదో కుట్ర జరుగుతోందమ్మా అంటూ ఆమె బదులిచ్చారని పూనమ్ కౌర్ వెల్లడించారు. "ఇవన్నీ చూసి మెదడు మొద్దుబారింది. ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి. ఇలాంటి రేపిస్టులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వారు నాశనమైపోతారు. నిర్భయకు న్యాయం జరగాలని వాహే గురు, తిరుపతి బాలాజీని వేడుకుంటున్నాను" అంటూ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

More Telugu News