Telugudesam: తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జగన్ వెన్నుపోటు పొడిచారు: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల

  • ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి రావాలంటే రాజీనామా చేయాలా!
  • ఆ మాటలు చెప్పిన జగన్ విశ్వసనీయత ఏమైంది?
  • జగన్ తన మాటలకు చెల్లుచీటి ఇచ్చేశారు 

ఇతర పార్టీల నేతలు తన పార్టీలోకి రావాలంటే వారు తమ పదవులకు రాజీనామా చేసే రావాలని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ నైతిక విలువలు, విశ్వసనీయత ఈరోజున ఏమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ఎమ్మెల్సీ పోతుల సునీతకు వైసీపీ కండువా కప్పినప్పుడు ఆ విలువలు జగన్ కు గుర్తుకురాలేదా? టీడీపీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి తాను వైసీపీలో ఉన్నట్టేనని చెప్పినప్పుడు జగన్ విశ్వసనీయత ఏమైంది? అని ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని చెప్పుకునే జగన్ ఆయనకు వెన్నుపోటు పొడిచారని, మండలి రద్దు నిర్ణయమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.

‘మాట తప్పను, మడమ తిప్పను’ అని చెబుతున్న జగన్ తన మాటలకు చెల్లుచీటి ఇచ్చేశారని విమర్శించారు. అసలు, జగన్ మడమలోనే నరం లేదని విరుచుకుపడ్డారు. ఒక కూచిపూడి నాట్యకారిణి తాను నృత్యం చేసే సమయంలో ఎన్నిసార్లు మడమ తిప్పుతుందో అంతకంటే ఎక్కువసార్లు జగన్ మడమతిప్పుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News