India: కివీస్ ను ఆటాడుకున్న టీమిండియా... ఆక్లాండ్ లో వరుసగా మరో గెలుపు

  • మొదట బ్యాటింగ్ చేసిన కివీస్
  • టీమిండియా టార్గెట్ 133 రన్స్
  • 17.3 ఓవర్లలో ఛేదించిన కోహ్లీ సేన

న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఆక్లాండ్ లో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించి ఆతిథ్య కివీస్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కివీస్ విసిరిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (8) విఫలమైనా సూపర్ ఫామ్ లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్ కు శ్రేయాస్ అయ్యర్ కూడా తోడవడంతో న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. అయ్యర్ 33 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 44 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే ఓ భారీ సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు టి20ల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆక్లాండ్ లోని ఇదే మైదానంలో జరిగిన తొలి టి20లో సైతం భారత్ నే విజయలక్ష్మి వరించింది. ఇరు జట్ల మధ్య మూడో  టి20 జనవరి 29న హామిల్టన్ లో ని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

More Telugu News