Khammam District: ఖమ్మం జిల్లాలో దారుణం.. నిద్రిస్తున్న వివాహితను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్!

  • జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో ఘటన
  • ఏడుగురిపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
  • పక్కింటి యువతి మేల్కొనడంతో దారుణం వెలుగులోకి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో దారుణం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న వివాహిత (35)ను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లిన యువకులు పత్తిచేనులోకి తీసుకెళ్లి మరికొందరితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిందీ ఘటన.

బాధితురాలిని కిడ్నాప్ చేస్తున్నప్పుడు అలికిడి కావడంతో మేల్కొన్న పొరిగింటి యువతి వారిని రహస్యంగా అనుసరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే, వారు వచ్చేలోపే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు హర్యాతండాకు చెందిన బాణోతు మోహన్, బాణోతు ఉపేందర్, అంగోతు కల్యాణ్, బానోతు చంటి, అజ్మీరా నాగేశ్వరరావు, సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్, బి.సునీల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలంటూ స్థానికులు, బంధువులు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News