Odisha: యాచకుడి గురించి అసలు నిజం తెలిసి అవాక్కయిన పోలీసులు!

  • పూరీ జగన్నాథుని ఆలయం వద్ద రిక్షా వాడితో ఘర్షణ
  • వివాదం పోలీస్ స్టేషన్ కి వెళ్లగా విచారణలో అతనో పెద్ద ఇంజనీర్ అని గుర్తింపు
  • మానసిక సమస్యలతో దేశదిమ్మరిలా మారిన వైనం

అతనో గొప్ప ఇంజనీర్. ఓ కం పెనీ అత్యున్నత అధికారి. తల్లిదండ్రుల మరణం, కుటుంబ సభ్యుల సమస్య కారణంగా మానసిక కల్లోలానికి గురయ్యాడు. దీంతో దేశదిమ్మరిలా తిరుగుతూ చివరికి భిక్షగాడి అవతారం ఎత్తాడు. రిక్షా వాడితో తగాదా సందర్భంగా ఈ విషయం వెలుగు చూడడంతో అవాక్కవ్వడం పోలీసుల వంతయ్యింది. పోలీసుల కథనం మేరకు.... ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథుని గుడిమెట్ల పై అడుక్కుంటున్న ఓ వ్యక్తి, ఒక రిక్షావాడు శుక్రవారం గొడవపడ్డారు. ఇద్దరూ కొట్టుకోవడంతో గాయపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో పోలీసులు వారికి చికిత్స చేయించారు.

అనంతరం ఇద్దరూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే కాషాయ వస్త్రధారణలో సాధువులా ఉన్న వ్యక్తి ఇంగ్లీష్ లో రాసిచ్చిన ఫిర్యాదు చూడగానే పోలీసులు కంగుతిన్నారు. భాష పై చక్కటి పట్టున్న వ్యక్తి రాసినదిలా ఉన్న ఆ ఫిర్యాదు చూడగానే సదరు సాధువు పై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో అతన్ని విచారించారు.

ప్రశ్నల వర్షం కురిపించడంతో చివరికి తన పేరు గిరిజాశంకర్ మిశ్రా అని, తనది భువనేశ్వర్ అని, ఒకప్పుడు మిల్టన్ కంపెనీలో ఇంజనీర్ నని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...పోలీసు అధికారిగా పనిచేసిన గిరిజాశంకర్ మిశ్రా తండ్రి కొన్నాళ్ల క్రితం చనిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తల్లి కూడా కాలంచేసింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

కానీ తల్లిదండ్రుల మరణం తర్వాత ఇంట్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా మానసిక కల్లోలానికి గురైన గిరిజా శంకర్ ఇల్లు, ఉద్యోగం వదిలేసి దేశదిమ్మరిలా మారిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఆకలి బాధ తట్టుకోలేక చివరికి యాచకుడిగా మారాడు. ఆలయాల వద్ద అడుక్కుంటూ చివరికి సుప్రసిద్ధ పూరీ క్షేత్రం ఇటీవలే చేరాడు. ఈ విషయాలన్నీ విన్న పోలీసులకు నోటమాట రాలేదు.

ప్రస్తుతం వారు గిరిజాశంకర్ కుటుంబ సభ్యులను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారు. వారు లభిస్తే అతన్ని వారికి అప్పగించాలన్నది వారి ఉద్దేశం. కానీ తనకు కుటుంబ సభ్యులతో కలవాలని లేదని గిరిజా శంకర్ చెబుతుండడం కొసమెరుపు.

More Telugu News