SarileruNeekevvaru: అమ్మ తోడయ్యా... ఇంకే పని చేయను... అంటూ చిరంజీవిని నవ్వించిన బండ్ల గణేశ్

  • సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
  • హాజరైన బండ్ల గణేశ్
  • సినిమా రంగంలోనే ఉంటానని స్పష్టీకరణ

హైదరాబాదులో జరుగుతున్న సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆసక్తికర ప్రసంగంతో మెగాస్టార్ చిరంజీవిని కూడా నవ్వించాడు. నిలువెత్తు సంస్కారానికి నిదర్శనం మెగాస్టార్ అంటూ మొదలుపెట్టిన బండ్ల గణేశ్ ఆపై తనదైన శైలిలో మాట్లాడి సభలో నవ్వులు కురిపించాడు. ఓ మెగాస్టార్ అయ్యుండి మరో సూపర్ స్టార్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయన సంస్కారానికి తన పాదాభివందనం అంటూ మాట్లాడాడు.

"మీరు వందేళ్లు చల్లగా ఉండాలి సార్, మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 43 ఏళ్లు. మీరు మరో 20 ఏళ్లు ఇండస్డ్రీలో అందరినీ అలరించాలి. ఎంత అందంగా ఉన్నారు సార్ మీరు. మహేశ్ బాబు పక్కన మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరూ అన్నదమ్ములుగా యాక్ట్ చేయాలనిపిస్తోంది సార్. మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ నటించాలని నేను మొక్కని దేవుడంటూ లేరు. కానీ నాకు ఒక్క సినిమా కూడా చెయ్యకుండా అన్నీ వాళ్లబ్బాయికే చేస్తున్నారు" అంటూ చమత్కరించారు.

అంతేకాదు, తనను బ్లేడ్ గణేశ్ అని పిలవొద్దని, దయచేసి బండ్ల గణేశ్ అనే పిలవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. తెలిసోతెలియకో నోరుజారానని అందరూ వెర్రిపప్పను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తాను కూడా నటించానని, ఇకపై తాను సినిమాలే లోకంగా బతుకుతానని స్పష్టం చేశారు. అమ్మ తోడయ్యా ఇంకే పని చేయను, సినిమాల్లోనే ఉంటానంటూ ప్రసంగం ముగించాడు.

More Telugu News