Nirbhaya: నిర్భయ దోషులకు నలుగురికీ ఒకేసారి ఉరి.. ఏర్పాట్లు షురూ!

  • దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసు
  • ప్రస్తుతం తీహార్ జైల్లో ఒకే ఉరికంబం
  • మరో మూడు కంబాలను, సొరంగాలను నిర్మిస్తున్న అధికారులు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో దోషులు నలుగురికీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో ఆ వెంటనే వారిని ఉరి తీయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ నెల 7న వీరిపై డెత్ వారెంట్ తీర్పు వెలువడనున్నట్టు తెలుస్తుండగా, నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం తీహార్ జైలులో ఒకే ఉరికంబం ఉండడంతో, మరో మూడింటిని నిర్మిస్తున్నారు. పీడబ్ల్యూడీ విభాగం సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమైంది. నూతనంగా మూడు ఉరికంబాలను, మూడు సొరంగాల నిర్మాణాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా, తీహార్ జైల్లో ఉరి తీసే ప్రదేశంలో మొత్తం 16 డెత్ సెల్స్ ఉండగా, రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించగానే, నలుగురినీ నాలుగు వేర్వేరు గదులకు జైలు అధికారులు తరలించనున్నారు.

More Telugu News