Hyderabad: శాంతియుతంగా దీక్ష చేస్తే.. అరెస్టు చేస్తారా?: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతిస్తారు.. కాంగ్రెస్ ర్యాలీకి ఎందుకివ్వరు?
  • నగర సీపీ అంజనీకుమార్  వైఖరి సరిగా లేదు
  • సోమవారం గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ ప్రాంగణంలో ఒక రోజు దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతల పట్ల పోలీసులు అనుసరించిన వైఖరిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. శాంతి యుతంగా దీక్ష చేస్తూంటే అరెస్టు చేస్తారా? ఇదేం పద్ధతి? అని ప్రశ్నించారు. ఈ విషయంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తీరును ఉత్తమ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతినిచ్చి కాంగ్రెస్ ర్యాలీకి అనుమతివ్వకపోవడంపై అంజనీకుమార్ ను విమర్శించారు.

‘దేశ పౌరులుగా, కాంగ్రెస్ వారసులుగా ప్లకార్డులతో నిరసన తెలుపుతామంటే అనుమతి నిరాకరించారు. శాంతియుతంగా గాంధేయ పద్ధతిలో నిరసన తెలుపుతామన్నా మా మాటలను పట్టించుకోలేదు. మా జెండా ఆవిష్కరణకు మా కార్యకర్తలకు అనుమతి లేదంటున్నారు. గాంధీ భవన్ చుట్టూ పోలీసులకు పెట్టాల్సిన అవసరమేముంది? నగర సీపీ వైఖరి సరిగా లేదు. ఓవరాక్షన్ చేస్తే అంతు చూస్తాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్ లో శాంతి భద్రతలపై గవర్నర్ కు పూర్తి అధికారాలున్నాయి. పోలీసుల తీరుపై సోమవారం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.    

More Telugu News