Mangalagiri: మంగళగిరిలో రైతుల కాగడాల ర్యాలీ.. ‘డౌన్ డౌన్ సీఎం..’ అంటూ నినాదాలు

  • ర్యాలీలో పాల్గొన్న లోకేశ్, రైతులు, స్థానికులు
  • ప్లకార్డులు చేతబూని నినాదాలు చేసిన రైతులు
  • ‘జై అమరావతి’ నినాదంతో మార్మోగిన మంగళగిరి

ఏపీ రాజధాని అమరావతి తరలిపోతుందన్న ప్రకటనతో ఆ ప్రాంత రైతులు తీవ్ర నిరసనలతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళగిరిలో కాగడాల ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో టీడీపీ నేత నారా లోకేశ్, టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో రైతులు, స్థానిక ప్రజలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబూనిన రైతులు, ప్రజలు ‘డౌన్ డౌన్ సీఎం.. డౌన్ డౌన్ సీఎం’, ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం..దోపిడీ రాజ్యం’, ‘జై అమరావతి.. జై జై అమరావతి’ అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.

ఇదిలా ఉండగా, వెలగపూడిలో రైతులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి.

More Telugu News