Bill Gates: బిల్ గేట్స్, ఆనంద్ మహీంద్రా ఇద్దరూ క్లాస్ మేట్స్.. ఓసారి ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందంటే..!

  • 1973లో హార్వర్డ్ లో కలిసి చదువుకున్నామన్న ఆనంద్ మహీంద్రా
  • 1997నాటి ఓ ఫొటోను షేర్ చేసిన నెటిజెన్
  • ఆ ఫొటో గేట్స్ తొలి భారత పర్యటన నాటిదని చెప్పిన మహీంద్రా

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, భారత ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. 1973లో హర్వర్డ్ యూనివర్శిటీలో ఇద్దరం క్లాస్ మేట్స్ అని ఆయన తెలిపారు. 'ఇన్ సైడ్ బిల్స్ బ్రెయిన్: డీకోడింగ్ బిల్ గేట్స్' అనే నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలోని ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు.

 ఈ ఫొటోను చూసిన ఆనంద్ మహీంద్రా తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా మహీంద్రా స్పందిస్తూ... ఈ ఫొటోను 1997లో తీశారని చెప్పారు. బిల్ గేట్స్ తొలిసారి భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో దీన్ని తీశారని... ఆ సమయంలో సెల్ ఫోన్ కెమెరాలు లేకపోవడంతో దానికి సంబంధించిన ఫొటో తన వద్ద లేకపోయిందని తెలిపారు. ఈ ఫొటోను షేర్ చేసిన వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు.

విండోస్ ఎన్టీ 4.0 వర్షన్ ను అప్పట్లో వాడిన తొలి కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటని... ఈ నేపథ్యంలో, తమతో సమావేశం కావాలని మైక్రోసాఫ్ట్ కోరిందని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

మీటింగ్ హాల్ లోకి బిల్ గేట్స్ అడుగుపెట్టిన వెంటనే... మనిద్దరం ఒకే సమయంలో హార్వర్డ్ లో ఉన్నామని అనుకుంటా అని అన్నారని మహీంద్రా తెలిపారు. దీనికి సమాధానంగా... 'ఔను. కానీ మనిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు. మీ మీద నాకు పగ ఉంది' అని చెప్పానని మహీంద్రా చెప్పారు. ఎందుకు పగ? అని గేట్స్ ప్రశ్నించారని... దీనికి సమాధానంగా, 'మీ కాలేజ్ క్లాస్ మేట్స్ లో అందరిలో ఎవరు ఎక్కువ ఫేమస్ అని నా కూతురు నన్ను ప్రశ్నించింది. దానికి సమాధానంగా మీ పేరు చెప్పాను. దీంతో, 'మీరు లూజర్ డ్యాడ్' అని నా కూతురు ఆటపట్టించింది. మీకు చాలా థ్యాంక్స్. మీ వల్ల నా పిల్లల ముందు నేను లూజర్ గా నిలిచా' అని చెప్పానని... దాంతో మీటింగ్ హాల్లో నవ్వులు విరబూశాయని ఆనాటి మధుర స్మృతులను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. మహీంద్రా చెప్పిన ఈ ఫన్నీ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు దీనిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

More Telugu News