Nirbhaya: వచ్చే నెలలో నిర్భయ దోషులకు ఉరి అమలు... తలారి కోసం వెతుకులాట!

  • 'బ్లాక్ వారెంట్' జారీ అయితే ఏ క్షణమైనా ఉరి
  • దానికన్నా ముందు కీలకం కానున్న రాష్ట్రపతి నిర్ణయం
  • క్షమాభిక్ష వద్దంటున్న ఢిల్లీ సర్కారు
  • తలారి కోసం వెతుకుతున్న తీహార్ జైలు అధికారులు

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపి, మహిళల రక్షణకు కొత్త చట్టాలు చేసేలా పాలకులను కదిలించిన నిర్భయ కేసులో దోషులకు వచ్చే నెలలో ఉరి శిక్ష అమలు కానుంది. ఇప్పటి వరకూ వారు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లు ఏవీ ఆమోదానికి నోచుకోలేదు. దీంతో తీహార్ జైలు అధికారులు వీరిని ఉరితీయడానికి సమయం దగ్గర పడిందని అంటున్నారు. అయితే, ఇదే సమయంలో తీహార్ జైల్లో ఉరిని అమలు చేయాల్సిన తలారి లేడట. అది ఓ పెద్ద సమస్యగా మారిందని, జైలు అధికారులు అంటున్నారు.

కోర్టు నుంచి దోషుల ఉరితీతకు సంబంధించి, అనుమతులిస్తూ, 'బ్లాక్ వారెంట్' జారీ అయిన తరువాత ఏ రోజైనా వారిని ఉరి తీయవచ్చని, చివరిగా వారు రాష్ట్రపతికి పెట్టుకునే అర్జీని కొట్టివేస్తే, ఆపై కోర్టు బ్లాక్ వారెంట్ ను ఇస్తుందని జైలు అధికారి ఒకరు తెలిపారు. జైలులో తలారి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరామని అన్నారు.

కాగా, తీహార్ జైల్లో చివరిగా పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురును ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాత్రికి రాత్రే జరిగిన పరిణామాలతో తలారిని నియమించకుండానే, జైలు అధికారులు ఉరికంబానికి ఉండే లివర్ ను లాగి, శిక్షను అమలు చేశారు. ప్రస్తుతం ఇతర ప్రధాన జైళ్లలో ఎవరైనా తలారి ఉన్నారా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, ఎవరైనా దొరికితే, అతన్ని తీహార్ కు తాత్కాలికంగా బదిలీ చేయించి, శిక్ష అమలుకు ప్రయత్నిస్తామని అధికారులు అంటున్నారు.

ఇండియాలో ఉరి శిక్షల అమలు అత్యంత అరుదుగా జరుగుతుంది కాబట్టే, చాలా జైళ్లలో శాశ్వత ఉద్యోగిగా తలారి పోస్ట్ లేదని జైలు అధికారులు అంటున్నారు. నిర్భయ కేసులో శర్మ, ముకేశ్, పవన్, అక్షయ్, రామ్ సింగ్, ఓ మైనర్ బాలుడు నిందితులు కాగా, మైనర్ బాలుడు విడుదలయ్యాడు. రామ్ సింగ్ జైల్లోనే ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన నలుగురినీ ఉరితీయాల్సి వుంది. ఇటీవల శర్మ మెర్సీ పిటిషన్ పెట్టుకోగా, దాన్ని తిరస్కరించాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది.

More Telugu News