Uttarakhand: బస్సులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి, తొక్కి చంపేసిన ఏనుగు!

  • ఉత్తరాఖండ్ లోని నైనితాల్ సమీపంలో ఘటన
  • విధులకు వెళ్లేందుకు బస్సెక్కిన టీచర్
  • ఏనుగు దాడిలో అక్కడికక్కడే మృతి

అడవిలో నుంచి రోడ్డుపైకి వచ్చిన ఓ ఏనుగు, తనకు ఎదురైన బస్సును అడ్డగించి, అందులో ఉన్న ఓ వ్యక్తిని బయటకు లాగి, తొక్కి చంపేసింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ లోని నైనీతాల్‌ సమీపంలో జరిగింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, టీచర్ గా పనిచేస్తున్న చంద్ర పాండేయ్ అనే వ్యక్తి, రోజు మాదిరిగానే డ్యూటీకి వెళ్లేందుకు బస్సులో ఎక్కారు. బస్సు అటవీ మార్గం గుండా వెళుతున్న సమయంలో ఓ ఏనుగు ఎదురు పడింది. బస్సులో ఉన్న కొద్ది మందీ బయటకు పరుగులు తీశారు. బస్సులోనే ఉండిపోయిన పాండేయ్ ని చూసిన ఏనుగు తీవ్ర ఆగ్రహంతో, అతన్ని బయటకు లాగి తొక్కేసింది. ఆపై అడవిలోకి వెళ్లిపోయింది.

ఇతర ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ అధికారులు వచ్చేసరికి అతను చనిపోయి ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న రామ్ నగర్ పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ప్రాంతంలోని అడవుల్లో ఉన్న ఏనుగులు ఇటీవల తరచూ రోడ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతున్నాయని అధికారులు తెలిపారు.

More Telugu News