MP pragya sing Thakur: నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించండి:ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్

  • గాడ్సే దేశ భక్తుడంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎంపీ
  • నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణ
  • తాను ఉగ్రవాదినంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన

రెండు రోజుల క్రితం పార్లమెంట్ లో జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడంటూ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై ఈ రోజు లోక్ సభలో ఆమె వివరణను ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తాను ఉగ్రవాదినని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని చెపుతూ.. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించితే.. అందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

‘లోక్ సభలో నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. న్యాయస్థానం నేను నిర్దోషినని ప్రకటించినా.. సభలో ఓ సభ్యుడు నన్ను ఉగ్రవాది అని పేర్కొన్నారు. నా పరువు, ప్రతిష్ఠలను దిగజార్చడానికే కొందరు నా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీపై నాకు గౌరవముంది. ఒకవేళ నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నారు. మరోవైపు సభలో ఆమె వివరణ కొనసాగుతుండగానే విపక్ష సభ్యులు మహాత్మాగాంధీకి జై, గాడ్సే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

More Telugu News