Udhdhav: సీఎంగా ఉద్ధవ్ థాకరే తీసుకున్న తొలి నిర్ణయం!

  • నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం
  • రాయగడ కోట అభివృద్ధికి రూ. 20 కోట్లు
  • పేదల సంక్షేమానికి కట్టుబడ్డామన్న ఉద్ధవ్

నిన్న మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ థాకరే, ఛత్రపతి శివాజీ స్వయంగా నిర్మించిన రాయగడ కోట అభివృద్ధికి నిధులను విడుదల చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ పురాతన కోటను అభివృద్ధి చేసేందుకు రూ. 20 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, వెంటనే తొలి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఉద్ధవ్, రాయగడ కోటపై మరింత దృష్టిని సారిస్తామని, టూరిజంకు పెద్దపీట వేస్తామని తెలిపారు.

తమ ప్రభుత్వం మహారాష్ట్రలోని పేదల వికాసానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, రైతుల పంట దెబ్బతిన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతుల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందో, ప్రస్తుతం కేంద్రం ఏం చేస్తున్నదో తనకు పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఉద్ధవ్ ఆదేశించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి తమ పార్టీ ప్రకటించిన కనీస ఉమ్మడి ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు.

More Telugu News