Adilabad District: కుమురం భీం జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, చేతి వేళ్లు నరికి.. కిరాతకంగా యువతి హత్య!

  • వంటపాత్రలు విక్రయించి జీవించే మహిళ
  • సాయంత్రం ఇంటికి వస్తున్న సమయంలో అడ్డుకున్న దుండగులు
  • అత్యాచారం చేసి చిత్ర వధ చేసి హత్య

తెలంగాణలోని కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలంలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను అడ్డుకున్న దుండగులు సామూహిక అత్యాచారం చేసి అనంతరం చిత్రవధ చేసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన ఓ మహిళ, భర్తతో కలిసి ఆరేళ్లుగా జైనూరు మండలంలో నివసిస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ వంటపాత్రలు, ఇతర వస్తువులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. రోజూ ఇద్దరూ తలో వైపు వెళ్లి విక్రయించి సాయంత్రం ఇంటికి చేరుకుంటారు.  

ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు భార్య కనిపించలేదు. ఆమెకు ఫోన్ చేస్తే పనిచేయకపోవడంతో అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఉదయం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్లాపటార్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో మహిళ నిర్జీవంగా కనిపించింది. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు.

సాయంత్రం ఆమె ఇంటికి వస్తున్న క్రమంలో దుండగులు ఆమెను అడ్డుకుని ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అత్యాచారం అనంతరంను దారుణంగా హింసించినట్టు అర్థమవుతోంది. ఆమె ఎడమ చేతి వేళ్లు నరికేశారు. శరీరంపై కత్తితో గాట్లు పెట్టి, ముఖంపై బండరాయితో మోది హత్య చేశారు.

నిందితులకు, మహిళకు మధ్య పెనుగులాట జరిగినట్టు ఘటనా స్థలంలో చిందరవందరగా పడివున్న సామగ్రిని బట్టి తెలుస్తోంది. హత్యచేసిన అనంతరం నిందితులు ఆమె మంగళసూత్రం, బంగారు గొలుసు, కాళ్ల పట్టీలు, మట్టెలు తీసుకుని పరారయ్యారు. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఎల్లాపటార్, మామిడిపల్లి గ్రామస్థులు లింగాపూర్‌లో ఆందోళన నిర్వహించారు.

More Telugu News