Chandrababu: దెబ్బలు తగిలాయి కానీ నేర్చుకోలేకపోతున్నాడు: సీఎం జగన్ పై చంద్రబాబు విసుర్లు

  • అక్రమకేసులు బనాయిస్తున్నారంటూ మండిపాటు
  • తాము ఇలా వ్యవహరించి ఉంటే మీ పరిస్థితేంటని ప్రశ్నించిన బాబు
  • ఇలాంటి సీఎంలను ఎంతోమందిని చూశామని వ్యాఖ్యలు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఈ వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని ఆరోపించారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని, కొన్నిచోట్ల అదీ లేదని తెలిపారు. అదే, వైసీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే టీడీపీ క్యాడర్ పై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి కేసులతో టీడీపీని అణచివేయాలనుకంటే అది సాధ్యం కాదని హెచ్చరించారు.

సీఎం జగన్ కు ఇప్పటికే అనేక దెబ్బలు తగిలాయి కానీ ఇంకా గుణపాఠం నేర్చుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఇందీరాగాంధీ హయాం నుంచి ఎంతో మంది రాజకీయనాయకుల్ని చూశామని, కానీ ఇంత దుర్మార్గపు పాలన చూడలేదని అన్నారు. ఇప్పుడో కొత్త పంథా ఎంచుకున్నారని, ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన మామూలు వ్యక్తులకు రాదని, ఆర్థికమూలాలు దెబ్బతీసి వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పని తాము చేసుంటే మీలో ఒక్కరైనా వ్యాపారాలు చేసుకునేవారా? అని చంద్రబాబు తీవ్రస్వరంతో ప్రశ్నించారు.

ఎక్కువ కాలం అధికారంలో ఉంది తామేనని, అలాంటిది ఈ వ్యక్తి తమకు కూడా కొత్త కొత్త మార్గాలు నేర్పిస్తున్నాడని చంద్రబాబు పరోక్షంగా సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "నిన్నటివరకు మర్యాదగానే ఉన్నాం, ఇకమీదట మర్యాదగా ఉండొద్దు... కక్ష తీర్చుకోండి అని నేర్పిస్తున్నాడీ ముఖ్యమంత్రి. ఇలాంటి సీఎంలను ఎంతోమందిని చూశాం" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News