Diwali: దేశ రాజధానిలో దీపావళి నాడు అగ్ని ప్రమాదాలు

  • ప్రాణ నష్టం జరగలేదు
  • భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
  • రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలన్న నిబంధన ఉల్లంఘన

దీపావళి పండగరోజు ఢిల్లీలో పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. సెంట్రల్ ఢిల్లీలోని ఒక మార్కెట్ లో ఉన్న దుకాణంలో బాణసంచా కాల్చడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. దీంతో నాలుగు, ఐదు అంతస్తుల్లో ఉన్న ప్యాకేజీ మెటీరియల్, ప్లాస్టిక్ బొమ్మలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను నియంత్రించారు. మరోవైపు బాణాసంచా పేలుళ్ల కారణంగా చాలా చోట్ల చెత్త కుప్పలకు నిప్పంటుకుంది. కొన్ని చోట్ల ట్రాన్స్ ఫార్మర్లు పేలడం, విద్యుత్ తీగలు కాలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

అగ్ని ప్రమాదాలు జరిగాయంటూ నిన్న అర్ధరాత్రి వరకు ఫైర్ సర్వీస్ విభాగానికి 245 కాల్స్ రాగా ఈరోజు ఉదయం 10గంటల వరకు మరో 96 కాల్స్ వచ్చాయి. అయితే, ప్రమాదాల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. రాత్రి 10గంటల వరకే బాణసంచా కాల్చాలని నిబంధనలు పెట్టినప్పటికి.. దీన్ని ఎవరూ పాటించడంలేదని, అర్ధరాత్రి వరకు కాలుస్తూనే వున్నారని అధికారులు చెబుతున్నారు.

More Telugu News