LS polls: భారీ వర్షంలో తడుస్తూ ప్రసంగించిన శరద్ పవార్!

  • సతారాలో ఎన్నికల ప్రచారం
  • నేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సరైన అభ్యర్థిని నిలబెట్టలేదు
  • ఈ పొరపాటును నేను అంగీకరిస్తున్నాను

కేంద్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ భారీ వర్షంలోనూ తడుస్తూ తన ఎన్నికల ప్రసంగాన్ని కొనసాగించారు. మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతారాలో శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారీ వర్షంలో తడుస్తూనే మాట్లాడుతూ... వర్షంతో దేవుడు తమను ఆశీర్వదిస్తున్నాడని వ్యాఖ్యానించారు. సతారాలో ఈ సారి ఎన్సీపీ అద్భుతం చేయనుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

'నేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఈ నియోజక వర్గంలో సరైన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ పొరపాటును నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఈ సారి నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే ఆ ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దడానికి అక్టోబరు 21 కోసం సతారా ప్రజలు ఎదురుచూస్తున్నారు' అని చెప్పారు. ఈసారి సరైన అభ్యర్థిని నిలబెట్టానని వారికే ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు.

కాగా, 288 సీట్లకు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తుతో పోటీ చేస్తున్నాయి. వీటి ఫలితాలు అక్టోబరు 24న వెల్లడవుతాయి.

More Telugu News