Chandrababu: ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చరిత్ర ఈయనది: చంద్రబాబు

  • మహిళా ఎంపీడీవోపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారు
  • చెప్పిన అక్రమాలను చేయకపోతే మహిళలు అని కూడా చూడరా?
  • ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?

మహిళా ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విధి నిర్వహణలో నిజాయతీగా ఉన్నందుకు ఓ మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే ఒకరు దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్ధరాత్రి వేళ ఆ మహిళా అధికారి పోలీస్ స్టేషన్ కు వెళ్తే... కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు జంకారంటే... ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలను చేయకపోతే మహిళలు అని కూడా చూడరా? అని చంద్రబాబు నిలదీశారు. ఆమె ఇంటికి కరెంట్ కట్ చేస్తారా? నీటి కనెక్షన్ కట్ చేస్తారా? ఇంటి ముందే చెత్తకుండీ పెడతారా? టీవీ కేబుల్స్ తెంపేస్తారా? ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రికి ఇవేమీ కనబడవా? అని ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో ఒక ముస్లిం మైనారిటీ జర్నలిస్ట్ ను చంపుతానని ఫోన్ లో బెదిరించారని తెలిపారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జమీన్ రైతు సంపాదకుడిపై దౌర్జన్యం చేసారని మండిపడ్డారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చరిత్ర ఈయనది అని అన్నారు. అప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే... ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారు.

More Telugu News