Kumaraswamy: బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదు: కుమారస్వామి

  • బీజేపీకి జేడీయూ మద్దతిస్తోందని వార్తలు
  • కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారన్న జీటీ దేవెగౌడ
  • ఖండించిన కుమారస్వామి

కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని మాజీ సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. గత వారంలో విశ్వాస పరీక్షను ఎదుర్కొని, అందులో విఫలమై, సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి, తమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వాలని వత్తిడి తెస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. యడియూరప్ప ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారని జనతాదళ్ నేత జీటీ దేవెగౌడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ వార్త తనకు తెలిసిందని, ఇది నిరాధారమని, పార్టీ నేతలు ఎవరూ ఈ రూమర్స్ ను నమ్మవద్దని కుమారస్వామి వ్యాఖ్యానించారు. వాస్తవ విరుద్ధమైన ఈ తరహా వార్తలను బీజేపీయే పనిగట్టుకుని ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. జీటీ దేవెగౌడ వ్యాఖ్యలను మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కూడా ఖండించారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. వ్యతిరేకించాల్సిన చోట వ్యతిరేకిస్తామని, రాష్ట్రానికి మేలు చేసే నిర్ణయాలను బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సమయంలో స్వాగతిస్తామని తెలిపారు.

More Telugu News