Andhra Pradesh: ఏపీలో మావోయిస్టుల పంజా.. ఇద్దరు గిరిజనుల కిడ్నాప్, హత్య!

  • మరో గిరిజనుడిని చితకబాదిన మావోలు
  • విశాఖపట్నం జిల్లా వీరవరంలో ఘటన
  • మావోల కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసుల కోసం ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు గిరిజనులను కాల్చి చంపారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలం వీరవరానికి నిన్న రాత్రి మావోలు చేరుకున్నారు. అనంతరం ఊరిలోని సత్తిబాబు, భాస్కరావు, లింగరాజును ఇళ్లకు వెళ్లి వారిని బయటకు రావాల్సిందిగా కోరారు.

వారు బయటకు రాగానే బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సత్తిబాబు, భాస్కరరావులు పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. తాము ఇన్ఫార్మర్లం కాదని ఇద్దరు గిరిజనులు మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఇద్దరిినీ అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం మరో గిరిజనుడు లింగరాజును తీవ్రంగా కొట్టి వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో గాలింపును ముమ్మరం చేశారు.

More Telugu News