Uttarakhand: రిషీకేశ్ లో లక్ష్మణ్ ఝులా వంతెన మూసివేత... చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే!

  • బలహీనంగా ఉందని నివేదిక
  • వాహనాలు తిరిగేందుకు అనుమతి నిరాకరణ
  • కొత్త వంతెన నిర్మిస్తామన్న ఉత్తరాఖండ్

రిషీకేశ్‌ లో ప్రధాన ఆకర్షణ, సాక్ష్యాత్తు లక్ష్మణుడు గంగానదిని దాటాడని చెప్పుకునే ప్రాంతంలో నిర్మించిన వంతెన లక్ష్మణ్ ఝులాను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మూసివేసింది. లక్ష్మణ్‌ ఝులా శిథిలావస్థకు చేరిందని రాష్ట్ర ప్రభుత్వానికి పీడబ్ల్యూడీ నుంచి నివేదిక రావడం, జరగరానిది ఏదైనా జరిగే ప్రమాదం ఉందని తెలపడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వంతెనపై ఇక వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని, భక్తులు నడిచి వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు.

ఈ వంతెన సుమారు 136 మీటర్లు ఉంటుంది. ఇది మూతపడటంతో సమీపంలోని వారు రెండు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి రామ్ ఝులా మీదుగా గంగానదిని దాటాల్సి వుంటుంది. త్వరలోనే కన్వార్‌ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. లక్ష్మణ్ ఝులా ప్రాంతంలోనే అదే పేరుతో సరికొత్త వంతెనను నిర్మిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెబుతోంది.

More Telugu News