SBI: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త

  • ప్రస్తుతం ఐఎంపీఎస్ లావాదేవీలపై చార్జీలు వసూలు చేస్తున్న ఎస్‌బీఐ
  • ఆర్‌బీఐ ఆదేశాలతో ఎత్తివేస్తున్నట్టు ప్రకటన
  • ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలు

తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) శుభవార్త చెప్పింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఐఎంపీఎస్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారుల నుంచి ఐఎంపీఎస్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు కానీ, ఆపై పదివేల రూపాయల వరకు రూ. 1 ప్లస్ జీఎస్టీని, పది వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిగే లావాదేవీలపై రూ.2 ప్లస్ జీఎస్టీ, లక్ష రూపాయల నుంచి రూ. 2 లక్షల వరకు రూ.3 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తున్నారు.

ఇకపై ఈ చార్జీలను వసూలు చేయబోమని ఎస్‌బీఐ పేర్కొంది. ఎ‌న్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేస్తున్నట్టు గత నెలలో భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

More Telugu News