Crime News: హైదరాబాద్‌లో కిడ్నాప్‌ అయిన బాలిక ఆచూకీ కొడంగల్‌లో లభ్యం

  • పాపను గుర్తించి సురక్షితంగా పట్టుకున్న పోలీసులు
  • నిన్న సాయంత్రం పకీరప్ప అనే వ్యక్తి కిడ్నాప్‌ చేసినట్టు గుర్తింపు
  • ఈరోజు పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తామన్న సీఐ

హైదరాబాద్‌ నగరంలో కిడ్నాప్‌ అయిన ఐదేళ్ల బాలిక వైష్ణవి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. కిడ్నాపర్‌ ఆమెను వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణానికి తీసుకువెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. నిన్న సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి వచ్చిన వైష్ణవి ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను తీసుకుని వెళ్లాడు. పాపకోసం వెతికిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ లభించక పోవడంతో రాత్రి 8 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీ కెమెరా పుటేజీ పరిశీలించి కొడంగల్‌కి చెందిన పకీరప్ప అనే వ్యక్తి పాపను తీసుకువెళ్లినట్లు గుర్తించారు. వెంటనే కొడంగల్‌ వెళ్లి పాపను సురక్షితంగా పట్టుకున్నారు. పాపను సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. పన్నెండు గంటల్లో కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News