Brindavan Lodge: కీడు శంకించిన మనస్విని.. తండ్రికి వాట్సాప్ చేసిన వైనం!

  • మనస్విని గొంతు కోసి హత్యాయత్నం
  • తనున్న లొకేషన్‌ను షేర్ చేసిన మనస్విని
  • తల్లిదండ్రులు లాడ్జికి చేరుకునే సరికే జరిగిన ఘోరం

హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ లాడ్జిలో యువతి గొంతు కోసి, యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఈ దారుణానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోచింగ్ సెంటర్‌లో పరిచయంతో కొనసాగిన వెంకటేశ్, మనస్వినిల స్నేహం, అతని ప్రవర్తన కారణంగా ఎంతో కాలం నిలవలేదు. నేడు బృందావన్ లాడ్జిలో రూమ్ తీసుకున్న వెంకటేశ్, మనస్విని అక్కడకు రావాలని కోరడంతో ఆమె లాడ్జి వద్దకు వెళ్లింది.

అయితే లాడ్జి వద్దకు చేరుకున్నప్పటి నుంచే అతడి ప్రవర్తనను అంచనా వేసిన మనస్విని, తనకేదో ముప్పుందని గ్రహించి తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశంతో పాటు తనున్న లొకేషన్‌ను షేర్ చేసింది. తల్లిదండ్రులు వచ్చే లోపే వారిద్దరి మధ్య ఘర్షణ జరగడం, వెంకటేశ్ మనస్విని గొంతు కోయడం జరిగిపోయాయి. పోలీసులు, మనస్విని తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడాన్ని గమనించిన వెంకటేశ్ వెంటనే బాత్రూమ్‌లోకి వెళ్లి చాకుతో తన చేతిని కోసుకున్నాడు. పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేశారు.

More Telugu News