Andhra Pradesh: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియపై.. క్యాంపు ఆఫీసులో సీఎం జగన్ సమీక్ష!

  • తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ
  • హాజరైన మంత్రులు బుగ్గన, పేర్ని నాని
  • ఎలక్ట్రికల్ బస్సులను తీసుకోవడాన్ని పరిశీలించనున్న జగన్

తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగుతోంది. తాజాగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ భేటీకి మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.

మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఆర్టీసీ విలీన కమిటీకి జగన్ ఈ భేటీలో దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం సచివాలయంలో అధ్యయన కమిటీ సభ్యులు విడివిడిగా భేటీ కానున్నారు. అలాగే ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టే విషయాన్ని కూడా సీఎం జగన్ పరిశీలిస్తారని తెలుస్తోంది. మూడు నెలల తర్వాత ఆర్టీసీ విలీన కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

More Telugu News