Japan: కనిపించినోళ్లను కనిపించినట్టు పొడిచేశాడు.. జపాన్‌లో దారుణం!

  • రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులపై దాడి
  • పొడుచుకుంటూ పోయిన నిందితుడు
  • అనంతరం తనను తాను గాయపర్చుకున్న వైనం

జపాన్‌లోని కవసాకి నగరంలోని నోబోరిటో రైల్వే స్టేషన్ వద్ద ఈ ఉదయం దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో వీరంగమేశాడు. కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచేశాడు. ఈ ఘటనలో 16 మంది గాయపడగా వారిలో 8 మంది ప్రైమరీ స్కూలు విద్యార్థులు ఉన్నారు. స్టేషన్‌లో రైలు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న 40-50 ఏళ్ల వయసున్న వ్యక్తి కత్తితో దాడిచేసుకుంటూ పోయాడు.

దీంతో స్టేషన్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 16 మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి, నిందితుడు మృతి చెందినట్టు తెలుస్తోంది. 

More Telugu News