Twitter: భార్య తెలివైనదైతే ఎన్ని ప్రమాదాలో..!: ఆనంద్ మహీంద్రా

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా
  • ఓ వార్తను విని భార్య వద్ద ప్రస్తావించిన మహీంద్రా
  • భార్య సమాధానాన్ని ట్విట్టర్ లో పంచుకోగా వైరల్

మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. దాదాపు 69 లక్షల మంది ఫాలోవర్లను తన ట్విట్టర్ లో కలిగున్న ఆయన, తన ట్వీట్ లతో నవ్వులు పూయిస్తుంటారు. తాజాగా, తాను చదివిన ఓ వార్తను పట్టుకుని భార్య తెలివైనదైతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో... అంటూ తన భార్యను ఆట పట్టించారు.

ఇంతకీ ఏమైందంటే, భార్య చెప్పే మాట వినాల్సి వస్తుందని ఓ వ్యక్తి 62 సంవత్సరాల పాటు చెవిటివానిగా, మాటలు రాని మూగవాడిగా నటించాడంటూ వచ్చిన ఓ వార్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. దీన్ని చూడగానే చాలాసేపు నవ్వుతూ ఉండిపోయిన ఆయన, దీని గురించి తన భార్య అనురాధ వద్ద ప్రస్తావించారట.

"నేను కూడా నిన్ను ఇలాగే ఫూల్ చేస్తే ఏం చేస్తావ్‌?" అని ప్రశ్నించగా, "నిజమా? సెల్‌ ఫోన్‌ లో మాట్లాడకుండా మీరు ఐదు నిమిషాలైనా ఉండగలరా?" అని అనురాధ అడిగారట. దాంతో ఆయన "ఆహ్‌, తెలివైన భార్య ఉంటే ఎన్ని ప్రమాదాలో" అని తమ మధ్య జరిగిన సంభాషణను ట్విట్టర్ లో ఉంచారు. ఇక ఇది వైరల్ అవుతోంది. దీనికి వేల సంఖ్యలో లైక్స్, షేర్లు వచ్చాయి.

More Telugu News