MS Dhoni: ఆ రహస్యం బయటకు చెబితే నన్ను జట్టు నుంచి తీసేస్తారు: ధోనీ

  • ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన సీఎస్కే
  • వరుస విజయాల రహస్యం చెప్పలేను
  • రిటైర్ అయ్యాకనే మాట్లాడతానన్న ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్ అనడంలో సందేహం లేదు. జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారధ్యంలో సీఎస్కే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కు వెళ్లిన తొలి జట్టుగానూ నిలిచింది. ఇప్పటికే 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. మంగళవారం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక వరుస విజయాల రహస్యం ఏంటన్న ప్రశ్నకు ధోనీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. తాను ఈ రహస్యాన్ని బయటకు చెబితే, వచ్చే ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తనను జట్టు నుంచి తొలగిస్తుందని అన్నాడు. వరుస విజయాలు వ్యాపార రహస్యమని అన్నాడు. అభిమానుల మద్దతు, ఫ్రాంచైజీ నుంచి వచ్చే ప్రోత్సాహం సహాయక బృందం పడే శ్రమ తమ విజయాల వెనకుందని, అంతకన్నా ఎక్కువ చెప్పాలంటే, క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకే మాట్లాడతానని అన్నాడు.

 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని తాను జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నాడు. షేన్ వాట్సన్ వరుసగా విఫలమవుతున్నా, అతని సత్తా తనకు తెలుసుకాబట్టే, అవకాశాలు ఇస్తూ వచ్చామని, హైదరాబాద్ తో మ్యాచ్ లో 96 రన్స్ చేయడం ద్వారా వాట్సన్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడని అన్నాడు.

More Telugu News