muralidhar rao: కర్ణాటకలో మా ఎత్తుగడలు ఫలిస్తున్నాయి: బీజేపీ నేత మురళీధరరావు

  • కర్ణాటకలో చంద్రబాబుకు ఆదరణ తగ్గింది
  • తెలుగు రాజకీయాలను కన్నడ ప్రజలు ఒప్పుకోరు
  • మా వ్యూహం కారణంగా కుమారస్వామి మాండ్యాకే పరిమితమయ్యారు

లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో అత్యధిక స్థానాలను గెలవబోతున్నామని బీజేపీ నేత, కర్ణాటక ఇన్ ఛార్జ్ మురళీధరరావు అన్నారు. కర్ణాటకలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రచారంతో కూటమికి నష్టం తప్ప లాభం లేదని చెప్పారు. టీడీపీకి, చంద్రబాబుకు కర్ణాటకలో ఆదరణ లేదని... తెలుగు రాజకీయాలను ఇక్కడకు తెస్తే, కన్నడ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. కర్ణాటకలో చంద్రబాబుకు ఆదరణ తగ్గిందని చెప్పారు. రాహుల్ ని ప్రధాని చేద్దామని చంద్రబాబు అంటున్నారని... అలాంటప్పుడు ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ లు కలసి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

కర్ణాటకలో తమ ఎత్తుగడలు ఫలిస్తున్నాయని మురళీధరరావు అన్నారు. తమ వ్యూహం కారణంగా ముఖ్యమంత్రి కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి బయటకు రావడం లేదని చెప్పారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్థాన్ లోని బాలాకోట్ పై జరిపిన దాడులు బీజేపీకి లాభిస్తాయని చెప్పారు. రోజురోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతోందని... మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

More Telugu News