Telangana: మద్యం మత్తుకు కుటుంబం బలి.. ఇద్దరు చిన్నారులను కిరాతకంగా చంపేసిన తండ్రి!

  • తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘటన
  • మద్యానికి బానిసై భార్యకు వేధింపులు
  • ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో పిల్లలపై దారుణం

మద్యం మహమ్మారికి ఓ కుటుంబం ఛిద్రమైపోయింది. భార్య విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ఓ భర్త తన ముగ్గురు పిల్లలను హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని రామచంద్రాపురం బొంబై కాలనీలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన భర్త తన భార్యను తీవ్రంగా వేధించేవాడు. దీంతో నెలరోజుల క్రితం భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన నిందితుడు నానమ్మ దగ్గర వున్న ముగ్గురు పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. అనంతరం కుమారుడు అఖిల్(7), కుమార్తె శరణ్య(4)లను ఉరివేసి హత్య చేశాడు.

ఆ తర్వాత పెద్ద కుమార్తె మల్లీశ్వరి(10) గొంతును కత్తితో కోసేందుకు ప్రయత్నించగా, బాలిక తప్పించుకుని నానమ్మ దగ్గరకు పారిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News