jagan: జగన్ కు ఓటు వేస్తే పసుపు-కుంకుమ తీసివేస్తారు: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

  • తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన చరిత్ర నీది
  • హత్యా రాజకీయాలు మీ మూడు తరాలకు ఉన్నాయి
  • చేసిన తప్పులను అఫిడవిట్ లో వివరించిన దుస్థితి నీది

ముఖ్యమంత్రి చంద్రబాబుకు కానీ, టీడీపీ నేతలకు కానీ వైసీపీ అధినేత జగన్ కు ఉన్న నేర చరిత్ర ఉందా? అని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. తండ్రి వైయస్ శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన చరిత్ర జగన్ దని విమర్శించారు. వైయస్ మరణానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కారణమని చెప్పి, రిలయన్స్ షాపులను తగలబెట్టించిన చరిత్ర కూడా జగన్ దేనని చెప్పారు. వైయస్ మరణం వెనుక సోనియాగాంధీ హస్తం కూడా ఉందని ఆరోపించారని తెలిపారు. అదే రీతిలో ఇప్పుడు వైయస్ వివేకాను చంద్రబాబు హత్య చేయించారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అసలు నీ తండ్రిని ఎవరు చంపారంటూ జగన్ ను రాజేంద్ర ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. పంచభూతాలు ఆయనను తమలో విలీనం చేసుకున్నాయని చెప్పారు. హత్యా రాజకీయాలు వైయస్ కుటుంబంలోని మూడు తరాలకు ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడటం వైసీపీ నేతలకే అలవాటని చెప్పారు. ఏపీలో ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్నాయని... ఏ కుటుంబంపై లేని హత్యారోపణలు మీ కుటుంబంపైనే ఎందుకున్నాయని ప్రశ్నించారు.

జగన్ అఫిడవిట్ లో 27 పేజీల్లో 31 కేసుల గురించిన వివరణే ఉందని... ఇంతకన్నా సిగ్గు చేటు ఉంటుందా? అని ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను అఫిడవిట్ లో వివరించే దుస్థితి నీదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీ క్రిమినల్ చరిత్రను నీ చేతులతోనే నీవే ఎన్నికల సంఘానికి సమర్పించావని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అవినీతికి, హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని అన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే పసుపు-కుంకుమ ఇస్తారని, జగన్ కు ఓటు వేస్తే పసుపు-కుంకుమ తీసివేస్తారని చెప్పారు.

More Telugu News