Ys viveka: వైఎస్ సునీతను మీరు ఏ రకంగా భయపెట్టారు?: జగన్ కు వర్ల రామయ్య సూటి ప్రశ్న

  • సిట్ పై  పూర్తి నమ్మకం ఉందని సునీత చెప్పలేదా?
  • ఆమెతో ప్లేట్ ఫిరాయించేలా చేశారు
  • మళ్లీ ఈ డ్రామా ఏంటీ?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ), కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఆయన కూతురు సునీతా రెడ్డి ఈరోజు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ ఎస్ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సిట్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, తన తన తండ్రి మరణాన్ని రాజకీయం చేయొద్దని మొదట్లో సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాజకీయం చేయొద్దని ఆమె చేసిన వ్యాఖ్యలు జగన్ గురించేగా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత, ఆమెతో కొంచెం ప్లేటు మార్పించారని, ఈరోజు పూర్తిగా ప్లేట్ ఫిరాయించేలా చేశారని ఆరోపించారు.

‘సిట్ పై నమ్మకం ఉందని చెప్పిన ఆమెతో, అదే సిట్ పై నమ్మకం లేదని చెప్పించింది మీరు కాదా? ఆమెను మీరు ఏ రకంగా భయపెట్టారు? మళ్లీ ఈ డ్రామా ఏంటీ? మీరు ఆడిస్తున్న డ్రామా కాదా? ఈమెకు ఢిల్లీ వెళ్లాలని తెలుసా? ఎలక్షన్ కమిషనర్ ని కలవాలని తెలుసా? అపాయింట్ మెంట్ బుక్ చేసింది మీరు కాదా?’ అంటూ జగన్ కు సూటి ప్రశ్నలు వేశారు. జగన్, విజయసాయిరెడ్డి చెరో పక్కన కూర్చొని ఆమెకు ఈ విషయాలన్నీ నూరిపోశారంటూ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.

More Telugu News