Lakshmis NTR: 'వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు'... అంటున్న ఎన్టీఆర్... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేటరికల్ ట్రయిలర్ విడుదల!'

  • రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'
  • ఈ ఉదయం ట్రయిలర్ ను విడుదల చేసిన వర్మ
  • నిమిషాల వ్యవధిలో వేల వ్యూస్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' థియేటరికల్ ట్రయిలర్ ఈ ఉదయం విడుదలైంది. 'వాడూ, నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు' అన్న ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన ఈ ట్రయిలర్ లో, ఎన్టీఆర్ జీవిత చరమాంకంలోని పలు ఘట్టాలను చూపించే ప్రయత్నం చేశారు.

"నేను... నేను కాను... నేను... నా ప్రజలు. నా ప్రజలే నన్నింతటి వాడిని చేశారు. ఇప్పుడు వాళ్లే నన్ను వద్దు అనుకుని ఆ పవర్ ని వెనక్కి తీసుకున్నారు" అన్న ఎన్టీఆర్ డైలాగ్ తో ట్రయిలర్ ప్రారంభమవుతుంది. "మీరనుకున్నట్టు ఆవిడ అంత మంచి మనిషి కాదు... ఇంతకుముందే ఆవిడకు చాలామందితో అఫైర్స్ ఉన్నాయని..." అన్న చంద్రబాబు పాత్రధారి డైలాగ్ వినిపిస్తోంది. ఆపై లక్ష్మీ పార్వతి "రామారావుగారు, ఆయన్ను పెళ్లి చేసుకోమని అడిగారు" అన్న డైలాగ్ (ఇది బహుశా ఆమె భర్త వీరగంధం సుబ్బారావు పాత్రధారితో కావచ్చు) వినిపిస్తుంది.

 "శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి మహామహా అందగత్తెలతో పరిచయమున్న ఆయనకి... దానిలో ఏముందనో..." అంటున్న ఎన్టీఆర్ కుమార్తె డైలాగ్, "మనం ఎందుకూ పనికిరాని దద్దమ్మల మనుకుంటున్నారా", "నా కొడుకు లోకేశ్ మీద ఒట్టేసి చెబుతున్నాను. దానిని ఆపాలని నేను చేసే ప్రయత్నంలో నాకు హండ్రెడ్ పర్సంట్ సపోర్ట్ కావాలి" అన్న డైలాగులు వినిపిస్తాయి. 'వెన్నుపోటు పొడిచారు... కుట్ర' అన్న పాట ప్రోమో, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలున్నాయి. చివరిగా "మనదగ్గర నిజం ఉంది నిజాన్ని ఎవరూ ఆపలేరు... గర్జన... సింహగర్జన" అంటూ ట్రయిలర్ ముగుస్తుంది. ఈ ఉదయం 9.27కు ట్రయిలర్ ను విడుదల చేయగా, ఇప్పటికే లక్ష వ్యూస్ దాటిపోయాయి.

More Telugu News