Andhra Pradesh: సైకో తండ్రి.. ఇద్దరు కుమారుల గొంతు కోసి హత్య.. అనంతరం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • మద్యానికి బానిసైన రమణమూర్తి
  • భార్య అలిగి పుట్టింటికి వెళ్లడంతో దారుణం

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో గొడవ జరగడంతో మనస్తాపానికి లోనైన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులను చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని సుబ్బయ్యతోటలో చోటుచేసుకుంది.

తాడేపల్లికి చెందిన యలపాటి రమణమూర్తి(45) తన భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులతో కలిసి ఇక్కడి సుబ్బయ్యతోట ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన రమణమూర్తి, భార్యతో తరచుగా గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో నిన్న కూడా రమణమూర్తి భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.

పూటుగా మద్యం తాగి నిన్న రాత్రి ఇంటికి చేరుకున్న రమణమూర్తి ఆవేశంలో కుమారులు దినేశ్(7) సాయి(6)లను గొంతుకోసి హతమార్చాడు. అనంతరం తానూ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News