Rammohan naidu: నేడు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఒక రోజు దీక్ష

  • కేంద్రం ప్రకటించిన జోన్‌లో హేతుబద్ధత లేదు
  • విశాఖ ఆదాయాన్ని ఒడిశాకు కట్టబెట్టారు
  • ఆ 8 స్టేషన్లను విశాఖ జోన్‌లో కలపాల్సిందే

తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి బుధవారం రాత్రి 9 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ వద్ద దీక్ష చేయనున్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌లో హేతుబద్ధత లేదని ఆరోపిస్తూ ఈ దీక్ష చేపట్టనున్నారు. రైల్వే జోన్ విభజనలో హేతుబద్ధత లేదని తొలి నుంచీ ఆరోపిస్తున్న టీడీపీ కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి పోరాటం ప్రారంభించింది.

దశాబ్దాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ పేరును జోన్ పేరుతో కేంద్రం చెరిపేసిందని ఆరోపిస్తున్న రామ్మోహన్ నాయుడు, కొత్తగా రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేసి విశాఖ ఆదాయాన్ని ఒడిశాకు కట్టబెట్టారంటూ కేంద్రం తీరుపై గత మూడు రోజులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస స్టేషన్ నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న ఎనిమిది స్టేషన్లను ఖుర్దా డివిజన్ నుంచి తప్పించాలని టీడీపీ ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. వీటిని విశాఖ జోన్‌లోనే కలపాలంటూ డిమాండ్ చేస్తున్న రామ్మోహన్ నాయుడు నేడు ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు.

More Telugu News