Allada brothers: అజ్ఞాతవ్యక్తి ఫోన్.. అమలాపురం టీడీపీ నేతలు అల్లాడ సోదరుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్ దాడులు

  • మూడు నెలల క్రితం అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు
  • ఏక కాలంలో ముగ్గురు సోదరుల ఇళ్లపై దాడులు
  • కీలక డాక్యుమెంట్ల స్వాధీనం

అమలాపురానికి చెందిన టీడీపీ నేతలు అల్లాడ సోదరుల ఇళ్లపై సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. అజ్ఞాత వ్యక్తి ఒకరు మూడు నెలల క్రితం ఇచ్చిన ఫిర్యాదుతోనే ఇన్‌కం ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

స్థానిక మోబర్లీపేటలో ఉంటున్న అల్లాడ సోదరులు స్వామినాయుడు, వాసు, శరత్‌ల ఇళ్లపై పదిమంది సభ్యులతో కూడిన బృందం ఏక కాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల తర్వాత కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల అల్లాడ సోదరులు కొంత భూమిని విక్రయించారు. దీని విలువను రూ. 12 కోట్లుగా చూపించడంతో అనుమానం వచ్చిన అధికారులు దానిపైనే ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, అల్లాడ సోదరులు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈ దాడులకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. 

More Telugu News